నాపై నమోదైన కేసుల వివరాలివ్వండి : రాష్ట్ర డిజిపి కి చంద్రబాబు లేఖ

అమరావతి : నామినేషన్‌ లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని, 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని కోరుతూ … రాష్ట్ర డిజిపి కి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం లేఖ రాశారు.

లేఖలో అంశాలు : ” కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్‌ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై పలు అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీసు స్టేషన్లలో, వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు నాపై పెట్టిన కేసుల విషయంలో తనకు సమాచారం ఇవ్వలేదు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న నాపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలని కోరుతున్నాను. నామినేషన్‌ దాఖలు చేయడానికి ఎన్నికల అభ్యర్థులు తమపై ఎక్కడ ఏ కేసు ఉందనే వివరాలు తెలియజేయాల్సి ఉంది.  ఏ క్షణలో అయినా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని కోరుతున్నాను. వ్యక్తిగతంగా నేను ప్రతి పోలీస్‌ స్టేషన్‌ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి మీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను. ” అని రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఎసిబి, సిఐడి విభాగాలకు కూడా చంద్రబాబు నాయుడు లేఖ పంపారు.

➡️