- సాగునీటి శాఖకు కెఆర్ఎంబి లేఖ
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : నీటి పంపకాల కోసం టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేసేందుకు రూ.ఏడు కోట్లు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబి) తెలుగు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కెఆర్ఎంబి సభ్యులు డాక్టర్ ఆర్ఎన్ శంకువా మంగళవారం రెండు రాష్ట్రాల సాగునీటి శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన నేపథ్యంలో నిధులు వెంటనే కేటాయించాలని కోరింది. 19వ కెఆర్ఎంబి భేటీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తన వాటా నిధులు ఇవ్వకపోతే, తామే మొత్తం వ్యయాన్ని సమకూరుస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వం కెఆర్ఎంబికి చెప్పిన సంగతి తెలిసిందే.
27న పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ) సమావేశం ఈనెల 27న హైదరాబాద్లో జరగనుంది. ఈమేరకు పిపిఎ సభ్యకార్యదర్శి ఎం. రఘురామ్ మంగళవారం లేఖ రాశారు. ఈ మేరకు ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చారు. రెండు రాష్ట్రాల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ అంతరాష్ట్ర సమస్యలను పిపిఎ దృష్టికి తీసుకేళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.