- గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందజేత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫలితాలు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెన్త్, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్ధులకు ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఇదే ప్రధమమన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు, మౌలిక సదుపాయాల కొరకు రూ.143 కోట్లు ఖర్చు చేశామన్నారు. నీట్కు ఉచిత శిక్షణా కేంద్రాల సంఖ్యను ఈ ఏడాది నుంచి 10కి పెంచుతున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. ప్రతిభకు పట్టంకట్టే విధంగా మెరిట్ విద్యార్ధులకు నగదు పురస్కారాలు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 315 మంది పదవ తరగతి, ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులకు ప్రశంసాపత్రాలు, మొదటి బహుమతి రూ.20 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడవ బహుమతి రూ.10 వేలు నగదు పురస్కారాలు అందజేశారు. ఉత్తమ సేవలందించిన సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన 36 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను మంత్రులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, ఎపి ఎస్డబ్ల్యుఆర్ఇఐఎస్ కార్యదర్శి వి.ప్రసన్న వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లావణ్యవేణి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి జి.గౌతమి, డైరెక్టర్ ఎస్.భార్గవి, విద్యార్ధులు, అధ్యాపకులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.