ప్రజాశక్తి-ఒంటిమిట్ట (వైఎస్ఆర్ జిల్లా) : ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం మహాసంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం యాత్రికులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడు దంపతులు, జెఇఒ వి.వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, సిపిఆర్ఒ డాక్టర్ టి.రవి, డిప్యూటీ ఇఒలు నటేష్ బాబు, గోవింద రాజన్, సెల్వం, ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గన్నారు.
బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను జెఇఒ వి.వీరబ్రహ్మంతో కలిసి టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడు ఆదివారం ఆలయం ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ మాట్లాడుతూ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీరామనవమి, పోతన జయంతి, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 9న హనుమంత వాహనం, ఏప్రిల్ 10న గరుడవాహనం, ఏప్రిల్ 11న శ్రీ సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 12న రథోత్సవం జరుగనున్నాయని వివరించారు. అనంతరం శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకటపూర్ణ ప్రసాద్ పాల్గన్నారు.