గ్రూప్‌ పోస్టులను 2 వేలకు పెంచాలి- పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Dec 13,2023 08:38 #KS Laxmanrao, #speech

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిన గ్రూప్‌1, 2 పోస్టులను 2 వేలకు పెంచాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన చర్చావేదికను విజయవాడలోని భలోత్సవ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌ా1లో 81 పోస్టులకు, గ్రూప్‌-2లో 897 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు. రాష్ట్రంలో లాక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణంలో నోటిఫికేషన్‌ వచ్చిందని, అయితే ఆశించిన స్థాయిలో పోస్టులను తీయలేదన్నారు. గత మూడేళ్ల క్రితమే వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎపిపిఎస్‌సి ప్రకటించిందని, ఇప్పటికీ పోస్టులు పెంచలేదని అన్నారు. అలాగే గ్రూప్‌ా2 పరీక్షలు నిర్వహించిన తరువాతనే గ్రూప్‌ా1 నిర్వహిస్తే నిరుద్యోగులకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న మాట్లాడుతూ.. గ్రూప్‌ా1, 2 పరీక్షల మధ్య సమయం ఇవ్వాలని కోరారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్‌ కేలండరు ఉంటుందని ప్రభుత్వం గతంలో చెప్పినప్పటికీ ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదన్నారు. రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ లేనందున వయోపరిమితి కనీసం 47 ఏళ్లకు పెంచాలని కోరారు. ఉచిత స్టడీ సర్కిల్‌ను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో తీసుకోవాలన్నారు. పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులు పద్ధతిని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు రాజేష్‌, డివైఎఫ్‌ఐ నాయకులు పి కృష్ణ, నాగేశ్వరరావు, శివ, శ్రీనివాస్‌, నవీన్‌, కాంతారావు, ప్రజాపతి, దేవేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️