విశాఖపట్నం : ద్రోణి, వాతావరణ అనిశ్చితి ప్రభావంతో …. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయని అంచనా వేసింది. పిడుగులుపడటంతోపాటు గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టిఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశముందని చెప్పింది. మరోవైపు సోమవారం నంద్యాల జిల్లా పసుపులలో 42.5, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 42.4, పల్నాడు జిల్లా రావిపాడులో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.
