ప్రజాశక్తి-అమరావతి : వైసిపి సానుభూతిపరుడు వర్రా రవీందర్ రెడ్డి కనబడటం లేదంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. వచ్చే వాయిదానాడు తుది విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసులోని ప్రతివాదులుగా ఉన్న పోలీస్ అధికారులు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారని తప్పుపట్టింది. హెబియస్కార్పస్ పిటిషన్ దాఖలు చేసి ఐదు మాసాలైందని, పిటిషన్పై విచారణ ముగిస్తామని ప్రకటించింది. తొలుత పిటిషనర్ తరపున న్యాయవాది వాదిస్తూ.. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రిజిస్ట్రార్ జ్యుడీషియల్ సమక్షంలో కర్నూలు టోల్ ప్లాజా సిసిటివిని పరిశీలించినట్లు చెప్పారు. రవీందర్రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు నవంబర్ 8న టోల్ ప్లాజా వద్ద నిర్బంధంలోకి తీసుకున్నారని చెప్పారు. దీనికి చెందిన సిసిటివి ఫుటేజీని హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద ఉంచినట్లు తెలిపారు. పోలీసులు నవంబర్ 8న నిందితులను అరెస్ట్ చేశారని, అయితే ఆ తర్వాత 11న అరెస్ట్ చేసినట్లు అఫిడవిట్లు వేశారని చెప్పారు. దీనిపై గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్ స్పందిస్తూ, రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద సిసిటివి ఫుటేజ్ పరిశీలన చేసినప్పుడు తాను కూడా ఉన్నట్లు చెప్పారు. దీనిపై పోలీసు అధికారుల నుండి వివరాలు తెప్పించుకుంటామని, గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు జస్టిస్ ఆర్ రఘునందన్రావు అనుమతినిస్తూ తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేశారు.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే కేసులో తన భర్తను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, భర్త ప్రాణాలకు హాని ఉందని, కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వలు ఇవ్వాలని కోరుతూ రవీందర్రెడ్డి భార్య కళ్యాణి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు వివిధ ప్రాంతాల్లో తిప్పి తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని ఆమె అభియోగం. ఈ కేసులో ఇటీవల హైకోర్టు, కర్నూలు టోల్ ఫ్లాజా సిసిటివి ఫుటేజీని పరిశీలించాలని ౖరిజిస్ట్రార్ జ్యుడీషియల్ను ఆదేశించింది.
