- అర్భన్ లోకల్ బాడీలకు భవననిర్మాణాలు, లే అవుట్ల అనుమతులిచ్చే అకారం
- అర్భన్ డెవలప్మెంట్ అథారిటీస్ సవరణ బిల్లు చర్చలో మంత్రి నారాయణ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అర్భన్ అథారిటీలకు ఇప్పటి వరకు హెచ్ఓడిలు ఎవరూ లేరని, ప్రస్తుతం తాము తీసుకొచ్చిన ఎపి మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీస్ సవరణ బిల్లు-2025తో ఒక హెచ్ఓడిని నియమించుకునే అధికారం అథారిటీలకు ఉంటుందని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఎపి మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీస్ సవరణ బిల్లు-2025ను శాసనసభలో ఆయన ప్రవేశపెట్టారు. సభ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో వెలగడపూడి రామకృష్ణబాబు, రామాంజనేయులు , విష్ణుకుమార్రాజు మాట్లాడారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అనేక రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చామన్నారు. అర్భన్ లోకల్ బాడీలకు భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల అధికారం కల్పించామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21 అర్భన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయని, మొత్తం 83శాతం జనాభా అర్భన్ అథారిటీల పరిధిలోనే ఉన్నారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో టిడిఆర్ బాండ్లు, భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులకు ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బందులను తొలగించేందుకు స్ధానిక సంస్థలకు అధికారాలు ఇస్తూ సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.