పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం

  • ఎడ్ల పందేల ముగింపు సభలో హోం మంత్రి అనిత

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రైతులు తగిన మెళుకువలు పాటిస్తే వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలో కూడా రైతులు అద్భుతాలు సృష్టించవచ్చని హోం మంత్రి వి.అనిత తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి వద్ద గత వారం రోజులుగా జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల పందేలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో హోం మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం ద్వారానే కాకుండా పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై కూడా దృష్టి సారించాలన్నారు. ఒంగోలు జాతి పశు సంపదను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఒంగోలు జాతి గిత్తలకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఒంగోలు జాతి ఎద్దులు కూడా బ్రెజిల్‌లో ఉన్నాయని, ఈ తరహా బ్రీడ్‌ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందని తెలిపారు. ఎడ్ల పందేల పోటీల ద్వారా మన సంస్కతిని, మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. మాజీ మంత్రి దూళ్లిపాళ్ల వీరయ్య చౌదరి స్ఫూర్తితో దూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీని అభివృద్ధి చేయడంతోపాటు పాడిపశువులను ఎంతో ఆదరిస్తూ లక్షలాది మంది రైతులకు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో శాసన పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, మండలి మాజీ చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️