ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధి హామీ పథకంలో పని ప్రదేశంలో జరిగిన ప్రమాదాల్లో గాయాలపాలైన, మరణించిన వేతనదారులకు అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు 2006 జులై 29న ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు 303కు సవరణలు చేశారు. ఈ ఉత్తర్వుల్లో ప్రమాదంలో గాయాల వల్ల శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే చెల్లించే నష్టపరిహారాన్ని రూ.25 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ సవరణ చేశారు. పూర్తిగా పక్షవాతం సంభవించి కదల్లేని స్థితికి వెళితే చెల్లించే పరిహారం రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ, పని ప్రదేశంలో ప్రమాదాల్లో 6 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు శాశ్వత అంగవైకల్యాన్ని పొందితే చెల్లించే పరిహారాన్ని రూ.25 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ ఉత్తర్వులను సవరించారు. పని ప్రదేశంలో వేతనదారులు లేక పిల్లలు మరణిస్తే వారికి చెల్లించే రూ.50 వేల ఎక్స్గ్రేషియోను రూ.2 లక్షలకు పెంచుతూ సవరణ చేశారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను ఆదేశించారు.
