ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగాన్ని పెంచండి

  • కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు : సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న రోజుల్లో ఆర్‌టిసిలో ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సిఎం ఆర్‌టిసిపై బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్‌టిసిలో డీజిల్‌ బస్సులు, ఎలక్ట్రికల్‌ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్‌లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌టిసిలోనూ ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కోనుగోలులో కేంద్రం ఇస్తున్న సబ్సిడీలను వినియోగించుకుని 1,253 ఎలక్ట్రిక్‌ బస్సులను సమకూర్చాలన్నారు. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపితే ఛార్జింగ్‌ విషయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని అధికారులకు సూచించారు. ఆర్‌టిసిలో అద్దె బస్సులు, సొంత బస్సుల విధానం వల్ల లాభనష్టాలు, సొంతంగా బస్సులు కొనుగోలు చేయడం వల్ల కలిగే ఉపయోగాలపై పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని సూచించారు. గత ప్రభుత్వం కొత్తగా బస్సుల కొనుగోలు చేయలేదని, 15 లక్షల కిలోమీటర్లు కంటే ఎక్కువ తిరిగిన బస్సులు కూడా ప్రస్తుతం సర్వీసులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే బస్సులకు బ్రేక్‌ డౌన్‌ సమస్యలు తలెత్తి, ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులను తగ్గించిందని, తిరిగి సర్వీసుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే కీలకమైన ఆర్‌టిసి కార్గో ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. ఆర్‌టిసిలో ఆన్‌లైన్‌ విధానాలను సమర్ధవంతంగా నిర్వహించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన 1,489 డీజిల్‌ బస్సులను సమకూర్చుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసింది తప్ప, ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. ప్రమాదాల నివారణకు ఎస్‌పి, కలెక్టర్‌, రోడ్‌ సేఫ్టీ అధికారులు సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను తొలగించాలని ఆదేశించారు. ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. వాహనదారులకు డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్‌సి కార్డులు అందించాలన్నారు.

ఉచిత బస్సు పథకంపై సమీక్ష
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై అధికారులతో సిఎం చంద్రబాబు చర్చించారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, తమిళనాడుతోపాటు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలన్నారు. ఈ మేరకు అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సిద్ధం చేయాలన్నారు.

➡️