మంత్రి గుమ్మడి సంధ్యారాణి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. తాగునీరు, విద్య, వైద్యం వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 9 ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూన్ నాటికి అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఇందుకు రూ.156 కోట్లు మంజూరు చేసి, పనులు ప్రారంభించామన్నారు. 4 వేలకుపైగా గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలతో ఐసిడిఎస్ కార్యక్రమాలను అనుసంధానం చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పిల్లలకు మంచి పోషకారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, రెండు వేల అంగన్వాడీ కేంద్రాలు, 1,268 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయన్నారు. పూరి గుడిసెల్లో ఉన్నవారికి పక్కా ఇళ్లు కట్టించనున్నట్లు తెలిపారు. పాడేరు, శ్రీశైలం ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజనులు ఉన్నట్లు గుర్తించామని, వీరిలో కొందరికి ఆధార్, రేషన్ కార్డులు లేవని తెలిపారు. వీరికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులను నియమించినా వారు అక్కడ ఉండటం లేదని, అందువల్ల గిరిజనులకు వైద్య సేవలు అందించడం సాధ్యం కావడం లేదన్నారు. పట్టణాల్లో కంటే గిరిజన గ్రామాల్లోనే సాధారణ ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. మెగా డిఎస్సిలో 2 వేల పైచిలుకు ఉద్యోగాలు గిరిజనులకు ఉన్నాయని, దీని వల్ల యువతకు ప్రయోజనం ఉంటుందన్నారు. జిఓ నంబరు 3 గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే సుప్రీంకోర్టు ఆ జిఓను కొట్టేసిందన్నారు. దీని స్థానంలో కొత్త జిఓ తీసుకొచ్చే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. విజయవాడ, నెల్లూరు ఐటిడిఎల్లో గిరిజన ప్రాంతాలు లేకపోవడంతో వీటిని అధికారికంగా చూపలేకపోతున్నట్లు చెప్పారు. డోలీ మోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఐటిడిఎ పిఒలు తదితరులు పాల్గన్నారు.
