ఫిజిక్స్ వాలాతో ప్రభుత్వం ఒప్పందం
టిబిఐతో మరో ఎంఒయు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ (యుఒఐ)ను ఏర్పాటుకు ఎడ్యుటెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా (పిడబ్ల్యూ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ వెబ్తో కలిసి పిడబ్ల్యూ రాష్ట్రంలో ఎఐ-ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ (టిబిఐ)తో మరో ఒప్పందం చేసుకుంది.
విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ రెండు ఒప్పందాలు వేర్వేరుగా శుక్రవారం జరిగాయి.
పరిశ్రమల డిమాండ్కు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ : లోకేష్
పరిశ్రమల డిమాండ్, ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్పై ఇన్నోవేషన్ యూనివర్సిటీ దృష్టి సారిస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు. కృత్రిమ మేధ (ఎఐ)లో రాష్ట్ర యువతను మొదటి స్థానంలో నిలిపేలా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగాయని తెలిపారు. టాలెంట్ డెవలప్మెంట్, నాలెడ్జి క్రియేషన్లో రాష్ట్రాన్ని బలోపేతం చేయాలని పిడబ్ల్యూను కోరామన్నారు. ఫిడబ్ల్యూ వ్యవస్థాపకులు, సిఇఒ అలఖ్పాండే మాట్లాడుతూ.. యుఎస్ జిఎస్వి వెంచర్స్, ఇతర పెట్టుబడిదారుల ద్వారా రూ.1000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. అకడమిక్ లెర్నింగ్ను ఇండిస్టీతో మిళితం చేసే సంస్థను రూపొందించడానికి యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ పనిచేస్తుందన్నారు.