ఎస్‌సి, ఎస్‌టి కేసుల్లో నిందితులకు బెయిల్‌ మంజూరు పరిధిపై విచారణ

ప్రజాశక్తి-అమరావతి : ఎస్‌సి, ఎస్‌టి కేసుల్లో నిందితులు నేరుగా హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయవచ్చునో లేదో అనే మీమాంసను తేల్చేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది ఓ మనోహర్‌రెడ్డి, న్యాయవాదులు ఎంఆర్‌కె చక్రవర్తి, శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదిస్తూ, రాజ్యాంగంలోని 226 అధికరణం కింద హైకోర్టుకు విస్తృతాధికారాలు ఉన్నాయని, ఎస్‌సి, ఎస్‌టి కేసుల్లో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసే పరిధి హైకోర్టులకు ఉంటుందని చెప్పారు. పూర్తిస్థాయి వాదనల నిమిత్తం విచారణ బుధవారానికి వాయిదా పడింది. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నెల్లూరు జిల్లా, పొదలకూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే కాకాణి.. హైకోర్టును ఆశ్రయించాక పోలీసులు ఎస్‌సి, ఎస్‌టి కేసును కూడా నమోదు చేశారు. అదేవిధంగా చిలకలూరిపేట టిడిపి సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి విడదల రజినిపై చిలకలూరిపేట పట్టణ పోలీసులు ఎస్‌సి, ఎస్‌టి కేసు నమోదు చేశారు. ఎన్‌ఎస్‌యు యువ నాయకుడు సంపత్‌ కుమార్‌ హత్య కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ న్యాయవాది కెసి కృష్ణారెడ్డి, గన్నవరం టిడిపి ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మోహన్‌ రంగారావు వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వొచ్చునో లేదో తేల్చాలంటూ డివిజన్‌ బెంచ్‌కు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ మల్లికార్జునరావు నివేదించారు. హైకోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయవచ్చా లేక హైకోర్టు కన్నా ముందు ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక కోర్టునే ఆశ్రయించాలా అనే వివాదంపై జస్టిస్‌ సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ విచారణ ప్రారంభించింది.

➡️