ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కానిస్టేబుల్పై దాడి కేసులో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. గతంలో హైదరాబాద్ గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్లోని రఘురామ కృష్ణరాజు నివాసం వద్ద మస్తీలో డ్యూటీలో ఉన్న తనపై రఘురామ కృష్ణరాజుతో పాటు మరో నలుగురు దాడి చేశారని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్కె ఫరూక్ బాషా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తనతోపాటు తన కుమారుడు, ఇతరులపై తెలంగాణలో దాఖలైన కేసును క్వాష్ చేయాలని రఘురామ.. హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తు 2022 జులై 12న సుప్రీకోర్టులో రఘురామ సవాల్ చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ఫరూక్ బాషా తరపున వకాలత్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ఆయన తరపు న్యాయవాది ధర్మాసనానికి అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం, వకాలత్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
