తోపుదుర్తికి నోటీసులిచ్చాకే విచారణ

ప్రజాశక్తి-అమరావతి : రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డికి బిఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని పోలీసులకు హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తుకు సహకరించకుంటే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు చెప్పింది. పోలీసుల విధులు అడ్డుకొని, దాడి చేశారనే కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ ప్రకాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ టి మల్లికార్జునరావు సోమవారం విచారించారు. మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో సత్యసాయి జిల్లా, పాపిరెడ్డిపల్లిలో హెలీప్యాడ్‌ వద్ద జరిగిన ఘటనపై కానిస్టేబుల్‌ తలారి నరేంద్రకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పుట్టపర్తి రూరల్‌ పోలీసులు తోపుదుర్తి ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తరపున సీనియర్‌ అడ్వకేట్‌ ఎస్‌ శ్రీరామ్‌ వాదిస్తూ, ఇదే కేసులోని ఇతర నిందితులకు బిఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) కింద వ్యవహరించాలని కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. నేరాభియోగాలు నిరూపణ అయితే ఏడేళ్లలోపు శిక్ష పడేవని, కావున సిఆర్‌పిఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నోటీసులిచ్చి పోలీసులు విచారణ చేయాల్సి వుందన్నారు. పోలీసుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ ప్రతివాదన చేస్తూ, అదే కేసులోని ఒక నిందితుడికి సిఆర్‌పిసి సెక్షన్‌ 41(ఏ) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు. ఈ ఉత్తర్వులు పిటిషనర్‌కు వర్తింబోవని, పిటిషనర్‌పై 13 కేసులున్నాయని, అయినా, దర్యాప్తుకు సహకరించడం లేదన్నారు.

➡️