ప్రజాశక్తి- హైదరాబాద్, గ్రేటర్ విశాఖ బ్యూరోలు : జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సబ్కమిటీ కన్వీనర్ అనుమకొండ సురేష్ (60) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. మళ్లీ వ్యాధి తిరగబడడంతో పది రోజుల క్రితం కుటుంబసభ్యులు ఆయనను ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం సురేష్ మృతి చెందారు. భౌతికకాయాన్ని తెల్లాపూర్లోని ఆయన కుమార్తె ఇంటికి తరలించారు. మంగళవారం ఉదయం తెల్లాపూర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సురేష్ మృతి పట్ల జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. 1995లో సిపిఎంలో సురేష్ చేరారు. ‘ప్రజాశక్తి’లో కొంతకాలం పనిచేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్ సంఘం రాష్ట్ర నాయకునిగా, విశాఖ సిటీ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శిగా సేవలందించారు. సురేష్ మృతి పట్ల సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, ప్రజాశక్తి ఎడిటర్ బి. తులసీదాస్, సిజిఎం అచ్యుతరావు సంతాపం తెలిపారు.