కాకాణికి లభించని ఊరట

May 9,2025 09:00 #Kakani did not get, #relief

ప్రజాశక్తి-అమరావతి : ఎస్‌సి, ఎస్‌టి కేసుల్లో నిందితులు నేరుగా హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయవచ్చా? లేదా? అనే అంశంపై జూన్‌ 16న విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ విధంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయవచ్చా? లేక ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక కోర్టునే ఆశ్రయించాలా? అనేది తదుపరి విచారణలో తేల్చుతామని ప్రకటించింది. అప్పటి వరకు తనపై పోలీసులు ఏవిధమైన కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న వైసిపి నేత కాకాణి గోవర్దన్‌రెడ్డి చేసిన వినతిని తిరస్కరించింది. నిర్ధేశించిన అంశానికే విచారణ పరిమితం కావాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని గుర్తు చేసింది. ఈ మేరకు జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి జస్టిస్‌ వి. సుజాత ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు పెట్టిన ఎస్‌సి, ఎస్‌టి కేసులో కాకాణి, చిలకలూరిపేట టిడిపి సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ పిల్లి కోటి ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట పట్టణ పోలీసులు నమోదు చేసిన ఎస్‌సి, ఎసిటి కేసులో మాజీ మంత్రి, వైసిపి నేత విడదల రజని, ఎన్‌ఎస్‌ఇయు నేత సంపత్‌ కుమార్‌ హత్య కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ న్యాయవాది కెసి కృష్ణారెడ్డి, గన్నవరం టిడిపి ఆఫీస్‌పై దాడి కేసులో మోహన్‌ రంగారావు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ఎస్‌సి, ఎస్‌టి కేసులో ముందస్తు బెయిల్‌ హైకోర్టు ఇవ్వవచ్చునో లేదో తేల్చాలని ఇటీవల సింగిల్‌ జడ్జి, ఆ కేసులను డివిజన్‌ బెంచ్‌కి నివేదించారు.

➡️