కవిత పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా..

  • సీబీఐ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

ఢిల్లీ : సీబీఐ అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. కవితను సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై 2 గంటల తర్వాత వాదనలు వింటామని జడ్జి తెలిపారు. మరోవైపు కవితను ఐదు రోజుల కష్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును న్యాయమూర్తి రిజర్వ్‌ చేశారు. వాదనల సందర్భంగా… ఈ కేసులో ప్రధాన కుట్రదారు కవిత అని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అప్రూవర్లుగా మారిన శరత్‌ చంద్ర, మాగుంట రాఘవ సెక్షన్‌ 161, 164 కింద వాంగ్మూలం ఇచ్చినప్పటికీ.. కవిత దర్యాప్తుకు సహకరించడం లేదని చెప్పారు. అభిషేక్‌ బోయినపల్లి హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బు చెల్లించారని తెలిపారు. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని చెప్పారు. ఈ విషయం బుచ్చిబాబు వాట్సాప్‌ చాట్‌లో బయటపడిందని చెప్పారు. శరత్‌ చంద్ర రెడ్డిని కవిత బెదిరించారని తెలిపారు. వాదనలు పూర్తి కావడంతో కవితను కోర్టు రూమ్‌ నుంచి అధికారులు తీసుకెళ్లారు. కోర్టు హాల్‌ నుంచి బయటకు వెళ్తున్న సందర్భంగా కవిత మాట్లాడుతూ… తనను సీబీఐ అరెస్ట్‌ చేయడం అక్రమమని అన్నారు.

➡️