ప్రజాశక్తి-అమరావతి: ఏపీలో పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సర్క్యులర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ దష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్ పత్రం తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శి.. సంక్షేమ కార్యదర్శులకు ఆథరైజేషన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. పింఛను పంపిణీ సమయంలో వాలంటీర్లు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని.. పంపిణీ చేసినట్టుగా ఫొటోలు, వీడియోలు తీయవద్దని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
