హిందూపురం : హిదూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి సోమవారం పలు అభివృద్ధి కార్యక్రకమాల్లో పాల్గొన్నారు. టేకులోడులోని ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్లో డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందిరమ్మ కాలనీలో గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్వాధీన పత్రాలను మంత్రి అనగానితో కలిసి పంపిణీ చేశారు. మొత్తం 237 మంది లబ్దిదారులకు స్వాధీన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రి ఎన్టీఆర్ హిందూపురం అంటే రెండో పుట్టినిల్లుగా భావించేవారు అని అన్నారు. టీడీపీ అంటే ఒక జవాబుదారి పార్టీగా పేరుగాంచింది.. రాయలసీమ గడ్డ.. నా అడ్డా.. అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న లీడర్ అని బాలకృష్ణ ప్రశంసించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో 50 కోట్ల రూపాయల నిధులతోపనులు చేయించినట్లు వెల్లడించారు. హిందూపురంలో శాశ్వత తాగునీటి పథకానికి 136 కోట్ల రూపాయలతో నివేదికలు సిద్ధం చేశామని, మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామని ఆయన తెలిపారు. 1984లోనే ఎన్టీఆర్ తూముకుంట వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం పురం ప్రజలు మర్చి పోలేనిది అని బాలకృష్ణ గుర్తుచేశారు