మూడో కాంటూరు వరకే కొల్లేరు

  •  పరిమితం చేయాలని సిఎంకు సిపిఎం లేఖ
  • ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని విజ్ఞప్తి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కొల్లేరు శాశ్వత పరిష్కారం కోసం మూడో కాంటూరు వరకు కుదించి,ఎకో సెన్సిటీవ్‌ జోన్‌ను 3వ కాంటూరుకు పరిమితం చేయాలని సిపిఎం రాష్ట్రకమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం లేఖ రాశారు. కొల్లేరును మూడో నుంచి ఐదో కాంటూరుకు విస్తరింపచేయడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు. ‘ఎన్నికల సమయంలో మీరు కొల్లేరు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని, 2014లో ప్రధాని మోడీ భీమవరం వచ్చిన సందర్భంగా మీ సమక్షంలో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలి’ అని కోరారు. పర్యావరణం, పక్షుల ఆవాసానికి కొల్లేరు నిలయం అనడంలో సందేహం లేదని, అదే క్రమంలో అనేక వందల సంవత్సరాలుగా చేపల వేట ప్రధాన వత్తిగా క జీవనాన్ని సాగిస్తున్న బిసి, ఎస్సి, ఇతర పేద ప్రజల సమస్యలను పరిష్కరించడం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశమని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై సుప్రీంకోర్టులో సాగుతున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్‌ కావాలని, తక్షణం అఖిలపక్ష పార్టీల సమావేశం జరిపి క్రొల్లేరు ప్రజలను ఆదుకోవడానికి శాశ్వత పరిష్కారానికై ప్రభుత్వం చొరవ చేయాలని కోరారు. గతంలో టిడిపి హయంలోనే 1999లో కొల్లేరును 5వ కాంటూరుకు విస్తరింపచేస్తూ జివో 120ను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆ తర్వాత రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం ఆ జివోను ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో ప్రభుత్వం ఇచ్చిన సొసైటీలు, జిరాయితీ భూముల్లోని చేపల చెరువులను విధ్వంసం చేసి అమలు చేయడంతో కొల్లేరు ప్రజల బ్రతుకులు రోడ్డున పడ్డాయని వివరించారు.
వారి జీవితాలు తిరిగి యధావిధిగా కొనసాగాలంటే కొల్లేరును 5 నుండి తిరిగి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజలకు ఉపాధి కల్పించాలని, సొసైటీలు, జిరాయితీ భూములను పునరుద్ధరించాలని, మిగులు భూములు పేదలకు పంచాలని, కొల్లేరు గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎన్నికల సమయంలో కొల్లేరు ప్రాంతంలో పర్యటించిన రాజకీయ పార్టీల నాయకులు ఆ ప్రాంత ప్రజలను ఆదుకుంటామని, వారికి రక్షణగా ఉంటామని వాగ్ధానాలు చేశారని గుర్తుచేశారు. కాని ఆ వాగ్ధానాలను అమలు చేసిన దాఖలాలు లేవని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల కొల్లేరు ప్రజల ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతినడంతో ఇప్పటికే అనేక మంది దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారని వెల్లడించారు.అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, జస్టిస్‌ మిత్రా కమిటీ, శ్రీరామకష్ణయ్య కమిటీల సిఫార్సులను అమలు చేయాలని కోరారు. కొల్లేరు కాలుష్యానికి అక్కడి ప్రజలు కారణం కాదని అటు కష్ణా, ఇటు ఏలూరు జిల్లాల పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్ధాలు, మురుగు డ్రైన్లు వల్లే కాలుష్యామౌతోందని అనేక నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయని తెలిపారు. కాలుష్య నివారణకు రెగ్యులేటర్లు నిర్మించాలని, కొల్లేరు వరద ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, ఇక్కడికి వచ్చే మురుగు డ్రైన్లు బాగు చేయాలని, ఆధునీకరించాలని, పూడిక తీయాలని, తుమ్మ, కిక్కిస, గుర్రపుడెక్క తొలగించాలని (ఛానలైజేషన్‌), అందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
పెనుమాకలంక తదితర గ్రామాల్లో కరకట్టలు లేకపోవడంతో వరద నీరు గ్రామాలపైకి వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొల్లేరు ఆపరేషన్‌ సందర్భంగా ప్రజలకు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. కొల్లేరు పక్షులను, పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలను రక్షించుకోవడం, వారి ఉపాధిని కాపాడటం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నట్లు తెలిపారు.
అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, భీమవరంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకొనేలా 5 నుంచి 3వ కాంటూరుకు కుదించాలని కోరారు. అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ సున్నిత ప్రాంత (ఎకో సెన్సిటీవ్‌ జోన్‌) పరిధి కాంటూరు 3 లోపునకు పరిమితం చేసేలా కేంద్రం, పర్యావరణ మంత్రిత్వ శాఖ తగు చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

➡️