కృష్ణా ట్రిబ్యునల్‌లో బలమైన వాదనలు వినిపించాలి

గోదావరి-బనకచర్లపై అభ్యంతరాలతో కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కి లేఖలు
పోలవరం ముంపుపై అధ్యయనం
నీటి పారుదల శాఖ సమీక్షలో సిఎం రేవంత్‌రెడ్డి
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణకు అంతరాష్ట్ర నదీజలాల వివాద చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్‌ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలనే విషయంపై కృష్ణాజలాల వివాదాల ట్రిబ్యునల్‌-×× (కేడబ్ల్యూడీటీ-2) ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం (ఎపిఆర్‌ఎ) – 2014లోని సెక్షన్‌ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఎపిఆర్‌ఎ ప్రకారం ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌ సైతం సెక్షన్‌ 3 ఆధారంగా నీటి పంపకాలు రెండు రాష్ట్రాల మధ్య చేపట్టాలని సూచించిందని సిఎం గుర్తుచేశారు. కెడబ్ల్యుడిటి-2 ప్రకారం తదుపరి విధివిధానాలపై (ఫర్‌దర్‌ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) ఎపి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా, అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వని విషయాన్ని సిఎం గుర్తు చేశారు. రాష్ట్ర నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు డి శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాధ్‌ దాస్‌, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేప్టటడంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సిఆర్‌ పాటిల్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులకు తెలంగాణ తరఫున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జిఆర్‌ఎంబి, కెఆర్‌ఎంబిలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలని సిఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు భద్రాచలం ముంపు విషయమై హైదరాబాద్‌ ఐఐటితో అధ్యయనం చేయించే అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలని సిఎం అధికారులను ఆదేశించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని సిఎం సూచించారు.

➡️