లేటరైట్‌ తవ్వకాల లీజులను రద్దు చేయాలి

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం
ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : పీసా, 1/70 చట్టం నిబంధనలు ఉల్లంఘించి, పర్యావరణానికి నష్టం కలిగించే లేటరైట్‌ తవ్వకాల లీజులను రద్దు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం డిమాండ్‌ చేశారు. షెడ్యూల్‌ ప్రాంతంలో గిరిజన చట్టాలను ఉల్లంఘించి తవ్వకాలు చేపడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాతవరం మండలం సుందరకోట పంచాయతీ నాగులకొండలో తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ లేటరైట్‌ తవ్వకాలను ఆపించాలని కోరారు. గత ప్రభుత్వంలో వ్యతిరేకించిన టిడిపి కూటమి నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి తవ్వకాలు చేయించడం దుర్మార్గమన్నారు.
గ్రామ సభ ఆమోదం లేకుండా తవ్వుతున్న 121 హెక్టార్ల అనుమతులను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. జీడి, మామిడి, వరి, ఇతర ఆహార పంటలు దెబ్బతినడంతో గిరిజనులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వృక్ష, ఔషధ సంపదను నాశనం చేస్తున్నారని తెలిపారు. గిరిజనులకు అన్యాయం చేసే లేటరైట్‌ తవ్వకాలను రద్దుచేయకపోతే పోరాటాలతో అడ్డుకుంటామన్నారు. కనీస సౌకర్యాల్లేని గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ఆదివాసీ వనరులను కొల్లగొట్టేలా ప్రభుత్వం చట్టాలను సవరిస్తోందని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనులు కాపాడుకుంటూ వస్తున్న అటవీ సంపదను కార్పొరేట్‌ శక్తులకు ప్రభుత్వం అప్పగిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రాజు, సీనియర్‌ నాయకులు త్రిమూర్తులు రెడ్డి, రాజవొమ్మంగి మండల కార్యదర్శి సూరిబాబు, ప్రజానాట్య మండలి నాయకులు రమేష్‌ పాల్గొన్నారు.

➡️