కేసులతో వేధిస్తున్న వారిని విడిచిపెట్టం

  • మాజీ సిఎం వైఎస్‌ జగన్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి నాయకుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని వైసిపి అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల స్థానిక సంస్థల వైసిపి ప్రజాప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అదే స్ఫూర్తితో మూడేళ్లూ పనిచేయాలని తెలిపారు. చంద్రబాబునాయుడు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని, అధికారం కోసం అనైతిక వ్యవహారాలు, అంతులేని అరాచకాలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, వ్యవసాయం సర్వనాశనం అయిందని పేర్కొన్నారు. పిల్లలు చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకుంటున్నారని, పెట్టుబడిసాయం లేక రైతులు విలవిల్లాడుతున్నారని అన్నారు. వైసిసి నాయకులను వేధిస్తున్న, ఇబ్బంది పెడుతున్న పోలీసుల అధికారుల పేర్లు రాసుకోవాలని, అధికారం వచ్చాక వారిని విడిచిపెట్టబోమని, చట్టం ముందు నిలబెడతామని అన్నారు. మద్యాన్ని ఊరూరా బెల్టుషాపులు పెట్టి డోర్‌ డెలివరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లేని స్కాములు ఉన్నట్లు చూపిస్తున్నారు : పుత్తా

రాష్ట్రంలో జరగని స్కాములు జరిగినట్లు చూపిస్తున్నారని, దాని పేరుతో జగన్‌కు అనుకూలంగా ఉన్న వారి ఇళ్లలో తనిఖీల పేరుతో పోలీసులు వేధింపులకు దిగుతున్నారని వైసిపి అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అక్రమాలకు బయటపెడుతున్న పత్రికల సంపాదకుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని అన్నారు.

➡️