నీతిఅయోగ్ వైస్ఛైర్మన్ను కోరిన చంద్రబాబు
రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై ప్రజంటేషన్
ట్రైసిటీగా చెన్నై, తిరుపతి, నెల్లూరును మార్చాలి
రీజినల్ గ్రోత్ హబ్లుగా తిరుపతి అమరావతి
వచ్చే నాలుగేళ్లలో 11 వేల ఎలక్ట్రిక్ బస్సులు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ”వన్ ఫ్యామిలీ వన్ ఎఐ ప్రొఫెషనల్ వన్ ఎంట్రర్ప్రెన్యూర్”గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, దీనికి కేంద్ర సాయం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీతిఅయోగ్ వైస్ఛైర్మన్ సుమన్ భేరీని కోరారు. శుక్రవారం వెలగపూడి సచివాలయానికి వచ్చిన భేరీకి ఎపిలో ఉన్న అవకాశాలను, అభివృద్ధి ఆకాంక్షలను సిఎం ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆవిష్కరణలకు సాంకేతికత అందించడం నూతన విధానాల అమలుకు తోడ్పడటంలో నీతిఅయోగ్ సహకారాన్ని కోరారు. ప్రతి ఏటా 15 శాతం వృద్ధిరేటు సాధించి 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు తద్వారా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా ప్రయత్నిస్తున్నట్లు సిఎం తెలిపారు. నీతి అయోగ్ మద్దతు ఉంటే రాష్ట్రం మరింత ముందుకు వెళుతుందని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఎపి మోడల్ రాష్ట్రంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రానికి రాష్ట్రానికి ఇది అనుకూల సమయమని, అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందని, అందులో నీతి అయోగ్ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందని సుమన్భేరీ పేర్కొన్నారు.
గ్లోబల్ లీడర్గా ఎపి
ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు, సుస్థిరత ప్రధానాంశాలుగా స్వర్ణాంధ్ర 2047పై దృష్ఠి పెట్టామని సిఎం పేర్కొన్నారు. మానవాభివృద్ధి ఉత్తమ పాలన అంశాల్లో గ్లోబల్ లీడర్గా ఎపిని తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని, విభజన వల్ల ఆర్థిక వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రోత్ ఇంజన్ లాంటి హైదరాబాద్ను కోల్పోవడం, ఎపి పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతోపాటు గత ఐదేళ్లలో మూలధన వ్యయంపై నిర్లక్ష్యం వల్ల మౌలిక వసతులు కల్పించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని వివరించారు. పాలనలో అడ్డంకులు తలెత్తినా రాష్ట్రానికి ఉన్న అనుకూలతలతో అన్ని విధాలా బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎపి దేశంలో మూడో అతిపెద్ద తీవ్రప్రాంతం కలిగి ఉండటం, పోర్టులు రైల్వే హైవేలతో కనెక్టివిటీ మూడు ఇండిస్టియల్ కారిడార్లు తూర్పు ఆగేయ ఆసియాకు గేట్వే కావడం వంటి అనుకూలతలు ఉన్నాయని తెలిపారు. పునరుత్పాదకత విద్యుత్, డేటా టెక్నాలజీలో పెట్టుబడులను ఆకర్షించడం ఎపికి ప్రధాన సానుకూలాంశాలని పేర్కొన్నారు.
మూడు నెలలకు ఒకసారి సమీక్ష
దేశంలో నాలుగు గ్రోత్ హబ్లలో ఒకటిగా ఉన్న విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్తోపాటు తిరుపతి అమరావతిని రీజినల్ గ్రోత్ హబ్లుగా మార్చేందుకు నీతి అయోగ్ సహకారం అందించాలని కోరారు. బ్లూఎకానమీ, గ్రీన్ హైడ్రోజన్, ఎఐ అభివృద్ధిని గ్రోత్ ఇంజన్గా గుర్తించామని అన్నారు. వీటిపై మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలని నీతిఅయోగ్ను కోరారు. ఎపి తీసుకున్న కీలక కార్యక్రమాలైన నదుల అనుసంధానం, పి4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన, 2047 విజన్లో పది ప్రధాన సూత్రాల అమలుకు నీతిఅయోగ్ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మూడు సీపోర్టులు, మూడు ఎయిర్పోర్టులు ఉన్న తిరుపతి చెన్నై, నెల్లూరును ట్రైసిటీగా తీర్చిదిద్దితే ఆ ప్రాంతం అభివృద్ధిలో దూసుకు వెళుతుందని సూచించారు. హైదరాబాద్లో తాను అభివృద్ధి చేసిన జీనోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో అత్యుత్తమ పాలసీలను ఎపిలో అమలు చేయాలనేది తమ విధానమని ముఖ్యమంత్రి చెప్పారు. 2029 కల్లా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో 11 వేలకుపైగా ఈవి బస్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో అన్ని బస్స్టేషన్లపైనా రూఫ్టాప్ సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు. సచివాలయానికి తొలిసారి వచ్చిన సుమన్భేరీకి సిఎం ఘనస్వాగతం పలకడంతో పాటు సమావేశం ముగిసిన అనంతరం కారువద్దకు వచ్చి వీడ్కోలు పలికారు.