- రాష్ట్రవ్యాప్త అంబేద్కర్ దృశ్య రూపక ప్రదర్శనలు : డివైఎఫ్ఐ
ప్రజాశక్తి- మంత్రాలయం (కర్నూలు) : అంబేద్కర్ అనేది పేరు, నినాదం కాదని ప్రతి ఒక్కరి గుండె చప్పుడు కావాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, యుటిఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కౌలన్న, విద్యుత్ శాఖ డిఇఇ అంజినయ్య అన్నారు. కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని డివైఎఫ్ఐ, కెవిపిఎస్, ఎస్ఎఫ్ఐ, అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సామాజిక చైతన్య – సాంస్కృతిక ఉత్సవ నాటిక ప్రదర్శన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి మే 17వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ దృశ్య రూపక ప్రదర్శనలు కొనసాగుతాయన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని, ఆయన ఆశయ సాధన కోసం పాటుపడాలని కోరారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపిఎస్సి సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఇ. తిక్కన్న, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి దేవదాసు, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు కె. విల్సన్, జె. రాజు, డివైఎఫ్ఐ నాయకులు అశీర్వాదం, ఆదాము, శంకర్, బాలు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.