టిటిడి గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారం

  • రాజకీయ లబ్దికోసమే కరుణాకర్‌ రెడ్డి వ్యాఖ్యలు : టిటిడి చైర్మన్‌

ప్రజాశక్తి- తిరుపతి సిటీ : టిటిడి గోశాలలో ఇటీవల వంద గోవులు మృతి చెందాయంటూ టిటిడి మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయని టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు విమర్శించారు. టిటిడి గోశాలలో గోవులను, గోవుల ఆవాసాలను, వాటికి రోజువారీ అందించే దాణాను మీడియా, అధికారులతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం బిఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ టిటిడి గోశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యమూ లేదని, గోవులను తల్లిలా భావించి ఎప్పటికప్పుడు దాణా, అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎక్కడో మృతి చెందిన గోవుల ఫొటోలను, గత పాలనలో గోశాలలో మరణించిన గోవుల ఫొటోలను చూపి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరుణాకర్‌ రెడ్డి టిటిడి చైర్మన్‌గా ఉన్నప్పుడు గోవులకు కాలం చెల్లిన మందులు, పురుగులు పడ్డ దాణా పంపిణీ చేసినట్లు వారి పాలనలో విజిలెన్స్‌ నివేదికే స్పష్టం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా అప్పటి విజిలెన్స్‌ నివేదికను, అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపించారు. అసత్య ఆరోపణలతో టిటిడి మీద బురద చల్లుతూ రాజకీయ లబ్ధిపొందాలని చూస్తే జీరో అవుతారని హెచ్చరించారు. గోశాలలో గోవుల సహజ మరణాలను ఆయన సొంత రాజకీయాల కోసం వాడుకోవాలని కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. గత పాలనంతా కమీషన్ల భాగోతమమేనని, కాంట్రాక్టర్లు అందరూ తాము కమీషన్లు ఇచ్చామని చెబుతున్నారని, టిటిడి కమీషన్ల చైర్మన్‌గా కరుణాకర్‌ రెడ్డి అపకీర్తి మూటగట్టుకున్నారని విమర్శించారు. తాను చైర్మన్‌ అయ్యాక అవినీతి మరక లేకుండా సేవలు అందిస్తున్నానని తెలిపారు. సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టిటిడి బోర్డు సభ్యులు జి.భాను ప్రకాష్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️