మెదక్: తెలంగాణలో హాస్టళ్ల పరిస్థితులు అధ్వానంగా మారాయి. కనీస వసతులు లేక, ఉడికి ఉడకని అన్నంతో హాస్టల్ విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు దర్శనమివ్వడంతో ఆందోళనకు దిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు జాతీయ రహదారిపై సైతం ఆందోళన చేపట్టారు. తాజాగా మెదక్ జిల్లా రామాయంపేట మండలలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో ఉదయం విద్యార్థినులకు పెట్టే టిఫిన్లో బల్లి పడటం కలకలం రేపింది.టిఫిన్ తిన్న 17 మంది విద్యార్థినులు వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హాస్టల్ సిబ్బంది విద్యార్థినులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, తాము రోజూ తినే ఆహారంలో పురుగులు వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండి పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్స్లో తనిఖీలు చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
