ఎలక్ట్రానిక్స్‌ పవర్‌హౌస్‌గా ఎపి

May 8,2025 21:07 #LG Electronics, #Nara Lokesh, #start
  • శ్రీసిటీలో ఎల్‌జి యూనిట్‌కు మంత్రి లోకేష్‌ భూమిపూజ

ప్రజాశక్తి – సత్యవేడు : ‘రాష్ట్రంలో సృష్టించే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్‌ పవర్‌హౌస్‌గా మార్చేందుకు బాటలు వేస్తున్నాం’ అని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ భూమి పూజను శ్రీసిటిలో గురువారం లోకేష్‌ చేశారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ…. ‘మేం ఈ రోజు ఎల్‌జి యూనిట్‌కు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం. మేడ్‌ ఇన్‌ ఆంధ్ర నుంచి మేడ్‌ ఫర్‌ ది వరల్డ్‌ వరకు మా జైత్రయాత్ర కొనసాగుతుంది. పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు… ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుపై చంద్రబాబునాయుడు నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది. మేము సులభతరమైన వ్యాపారానికి హామీ ఇవ్వడమేగాక స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాలను అనుసరిస్తున్నాం’ అని అన్నారు. రాబోయే నాలుగేళ్లలో శ్రీసిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్‌ కనెక్టివిటీ కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ హంగ్‌ జు జియోన్‌, కొరియా రాయబారి లీ సియాంగ్‌ హూ, ఎలక్ట్రానిక్స్‌ హోం సొల్యూన్స్‌ సిఇఒ జేచియోల్‌ లియు, ఎకో సొల్యూషన్స్‌ సిఇఒ జేసంగ్‌ల, సీడాప్‌ ఛైర్మన్‌ దీపక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జులై నుంచి అర్హులందరికీ పింఛన్లు

జులై నుంచి అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని, వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. సత్యవేడు నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం రెండో రోజు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. శత్రువులపై పోరాటానికి ప్రధాని నరేంద్రమోదీ ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలుస్తామన్నారు. అంతకుముందు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమావేశం అనంతరం విజయవాడకు చేరుకున్నారు.

➡️