తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్‌

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, జెసిలు, రైస్‌ మిల్లర్లతో కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రబీలో ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించారు. కొనుగోళ్లలో ఇబ్బందులు, అకాల వర్షం వల్ల రైతులు పడుతున్న సమస్యలను జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గడిచిన తొమ్మిది నెలల్లో 49.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.11,400 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేశామని తెలిపారు. అకాల వర్షాల వల్ల తడిసి ధాన్యమంతా కొనుగోలు చేస్తామని, తేమ 22 శాతం వరకూ ఉన్నా కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు. పంటల ఎన్యూమరేషన్‌ ప్రక్రియ వెంటనే చేపట్టాలన్నారు. అన్ని జిల్లాల్లో ఇకపై బ్యాంకు గ్యారంటీనీ ప్రమాణికంగా 1:2గా అమలు చేస్తామని తెలిపారు. మూడు జిల్లాల్లో సిఎంఆర్‌ టార్గెట్‌ను అదనంగా పెంచామని చెప్పారు. కాకినాడ జిల్లాకు 50 వేల టన్నులు, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు లక్ష టన్నులు, తూర్పుగోదావరి జిల్లాకు ఇప్పటికే పెంచిన ధాన్యం కొనుగోలు లక్ష్యం 30 వేల టన్నులకు అదనంగా మరో 50 వేల టన్నులు టార్గెట్‌లను పెంచుతున్నామని తెలిపారు. సమావేశంలో కాకినాడ ఎంపి తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు, కుడా చైర్మన్‌ తదితరులు పాల్గన్నారు.

➡️