ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాజీ సిఎం జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వైసిపి హయాంలో యూనిట్ విద్యుత్ కేవలం రూ.2.49కే కొనుగోలు చేశామని జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనిట్ను రూ.5 కంటే ఎక్కువ చెల్లించి విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేశారని తెలిపారు. యాక్సిస్ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వంద శాతం సక్రమమైనదేనని అన్నారు. ఈ సంస్థ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు, ప్రభుత్వానికి పన్నుల రూపేణా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. స్వలాభం కోసం జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలకు, ప్రజా అవసరాల కోసం కూటమి ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలకు చాలా తేడా ఉందని తెలిపారు. యాక్సిస్ సంస్థ సోలార్, విండ్తో పాటు బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను నిర్వహిస్తుందని చెప్పారు. ఈ సంస్థ నుంచి ప్రజావసరాలు, విద్యుత్ వినియోగం మేరకు మాత్రమే విద్యుత్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వ అనైతిక విద్యుత్ ఒప్పందాలతో పీక్ అవర్స్లో ప్రస్తుతం యూనిట్కు రూ.8 నుంచి 10 వరకూ చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇటువంటి సమస్యలను అధిగమించాలంటే సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజితో చేస్తున్న తొలి ప్రాజెక్టును త్వరలోనే రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.
