ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన కుట్టు శిక్షణా కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర బిసి, ఇడబ్ల్యుఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత అధికారులను ఆదేశించారు. శిక్షణా కేంద్రాలను కార్యనిర్వాహక సంచాలకులు (ఇడి) తరచూ సందర్శించాలని ఆదేశించారు. వంద శాతం మేర లబ్ధిదారులు శిక్షణకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయం నుంచి బిసి సంక్షేమశాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జునతో కలిసి అన్ని జిల్లాల ఇడిలు, బిసి సంక్షేమ శాఖ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళను పారిశ్రామికవేత్తను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,02,832 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణతోపాటు కుట్టు మిషన్ను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణా కేంద్రాల నిర్వహణ బాధ్యత ఇడిలదేనన్నారు. ఇడిలు ప్రతిరోజూ ఈ కేంద్రాలను సందర్శించి ఫోటోలను ఎమ్డి కార్యాలయ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయాలని మంత్రి ఆదేశించారు. లబ్ధిదారుల అభిప్రాయాలతో వీడియో రూపొందించి, సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున అధికారులకు పలు సూచనలు చేశారు.
