ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మ్యాన్ పవర్ ఏజెన్సీల అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కార్మిశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సచివాలయంలో కార్మిక, పరిశ్రమలశాఖల అధికారులతో మంగళవారం సమావేశమైన మంత్రి ఏజెన్సీల ఆధ్వర్యాన పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు పిఎఫ్ కూడా చెల్లించడం లేదన్నారు. ఇటువంటి ఏజెన్సీలపై చర్యలు తప్పవన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పరిశ్రమలశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తొలుత కార్మికశాఖ వెబ్సైట్తో పాటు, పరిశ్రమలశాఖ వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 86 లక్షల మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చర్యల కారణంగా కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయని చెప్పారు. ఇక అధికారులు ప్రభుత్వం కార్మికుల కోసం అందజేస్తున్న పథకాలపై అవగాహన పెంచాలన్నారు. చంద్రన్న బీమా పథకంలో ప్రతి కార్మికుడు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికశాఖ ఆధ్వర్యాన ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక ఆధునిక విధానాలపై కార్మికులకు పూర్తి స్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇ-శ్రమ్ పోర్టల్లో కార్మికుల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఇఎస్ఐ డిస్పెన్సరీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొబైల్ యాప్తో కార్మికులు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా పొందే అవకాశం ఉందన్నారు. ఈ యాప్పై కార్మికులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంతో వాట్సాప్ గవర్నెన్స్, ఎఐ టూల్స్, గ్రీవెన్స్ మేనేజ్మెంట్ వంటి ఫీచర్లు ఈ యాప్లో అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి శేషగిరిబాబు, అదనపు ముఖ్యకార్యదర్శి గంధం చంద్రుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
