సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్ – 31న పైనల్స్
ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో : మహిళా సంఘాల నిరసనల నడుమ హైదరాబాద్లో ని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. 110కి పైగా దేశాల నుంచి సుందరీమణులు వచ్చారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన వేదికపై తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కళారూపాలను ప్రదర్శించారు. ఒగ్గుడోలు, లంబాడా, గుస్సాడి, కొమ్ము కోయ కళాకారులతో పాటు 250 మంది పేరిణి నృత్య కళాకారుల అభినయాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అనంతరం పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాల మహిళా ప్రతినిధులు తమ దేశాల సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ ర్యాంప్పైకి వచ్చారు. కరేబియన్ లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండం నుంచి అంగోలా, యూరప్ ఖండం నుంచి అల్బేనియా దేశాలకు చెందిన పోటీదారులు తొలి మూడు వరుసల్లో ర్యాంప్పైకి వచ్చారు. అనంతరం ఇతర దేశాల పోటీదారులు ర్యాంప్పై తమ దేశాలకు చెందిన ఆహార్యాలు, సంప్రదాయాలను గుర్తుచేస్తూ, ప్రదర్శనలు ఇచ్చారు. చివరగా మిస్ ఇండియా నందిని గుప్తా జాతీయ పతాకాన్ని చేతపట్టి ర్యాంప్పైకి వచ్చారు ఆమెను చూడగానే సభికులు హర్షధ్వానాలు పలికారు. మిస్ నేపాలీ కాంటెస్టెంట్ చీరకట్టుతో ర్యాంప్పైకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రారంభవేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆతిధ్య రాష్ట్రం తెలంగాణకు ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిష్టినా అభినందనలు తెలిపారు. అంతకుముందు, సరిహద్దుల్లో దేశంకోసం పోరాడుతున్న సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ప్రపంచ శాంతి, ఐక్యతకు ఈ పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభిస్తున్నట్టు సిఎం అధికారికంగా ప్రకటించారు. జాతీయ గీతం, మిస్ వరల్డ్ గీతం ఆలపించారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల కోసం వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 110 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు తమ దేశాల జాతీయ పతాకాలతో ఒకేసారి వేదికపైకి వచ్చారు. ఆదివారం నుంచి నిర్వహకులు పలు దశల్లో పోటీలు నిర్వహిస్తారు. మే 31న జరిగే ఫైనల్స్ల్ మిస్ వరల్డ్ను ప్రకటిస్తారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న స్టేడియం వద్ద పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు.