MLC Kavitha : నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

Mar 26,2024 08:19 #custody, #ED, #ending, #MLC Kavitha, #today

తెలంగాణ : ఢిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించి అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ … నేటితో ముగియనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు కవితను ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశించింది. దీంతో కవితకు బెయిల్‌ వస్తుందా ? అనే విషయమై ఆసక్తి నెలకొంది. నేడు కవితను కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో న్యాయవాది మోహిత్‌ రావు ఆమెతో పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.

లిక్కర్‌ కేసుకు సంబంధించి మార్చి 15వ తేదీన హైదరాబాదులో కవితను ఈడి అరెస్ట్‌ చేసి విచారించింది. ఇప్పటికే లిక్కర్‌ కేసులో పలువురు నిందితులు అరెస్టయ్యి వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల వాంగ్మూలాలపై ఈడి అధికారులు కవిత నుంచి క్లారిటీ తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ తో కలిపి విచారించేందుకు మరో రెండు రోజుల కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రయల్‌ కోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌ వేశారు. ఈ రెండు వాదనలను రోస్‌ అవెన్యూ కోర్టు ఈరోజు వినే అవకాశం ఉంది. మరోసారి కవితను ఈడీ కస్టడీకి ఇస్తారా ? లేక జ్యుడీషియల్‌ కస్టడీకి కోర్టు ఇస్తుందా ? లేకపోతే బెయిల్‌ మంజూరు చేస్తుందా ? అనే అంశాలపై స్పష్టత రానుంది. ఇప్పటివరకు కస్టడీలో ఉన్న కిక్‌ బ్యాక్‌ల గురించి కవితను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఈడీ ఆరోపిస్తుంది. ఈ విషయంపై మరింత లోతైన ప్రశ్నలు వేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు. నలుగురి వాంగ్మూలాలను కవిత నుంచి అడిగారని ఆమె కోర్టుకు తెలిపారు. డాక్టర్‌ చెప్పినట్లు కవితకు మందు ఇస్తామని ఈడీ చెబుతోంది. సమీర్‌ మహేంద్రుడితో పాటు కవితను కూడా విచారించాలని ఈడీ తెలిపింది. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్‌ కుమార్‌, రాజ్యసభ సభ్యుడు వావిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్‌ రావు, పీఏ శరత్‌ నిన్న రాత్రి కలిసి ఆమెతో సుమారు గంటసేపు మాట్లాడారు. ఈ చర్చల్లో ఆమె పీఏ శరత్‌ కూడా పాల్గన్నారు. కవిత భర్త అనిల్‌ ముందుగా ఆమె యోగక్షేమాలు అడిగి ఆమెకు ధైర్యం చెప్పినట్లు సమాచారం. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని వావిరాజు రవిచంద్ర హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

➡️