Rains – మరో మూడు రోజులు మోస్తరు భారీ వర్షాలు…

విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్‌ తీరంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఒడిశా తీరం మీదుగా కోస్తాంధ్ర వరకూ విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తున కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్‌, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మే 10 తర్వాత అండమాన్‌ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీనిపై కొద్దిరోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. ఆదివారం నంద్యాల జిల్లా గోనవరం, నెల్లూరు జిల్లా సోమశిల, తిరుపతి జిల్లా వెంకటగిరి, వైఎస్సార్‌ జిల్లా కమలాపురం తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. మరో రెండు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు.

➡️