- ఎంఎస్ఎంఇ పార్క్ శంకుస్థాపనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి – పద్మనాభం (విశాఖపట్నం) : అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని, రాబోయే రెండేళ్లలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్క్ ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో ఎంఎస్ఎంఇ పార్క్కు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంఎస్ఎంఇ కార్పొరేషన్ చైర్మన్ టి.శివశంకర్తో కలిసి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో శంకుస్థాపన చేస్తున్న ఈ ఎంఎస్ఎంఇ పార్క్ భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యావంతులైన గ్రామీణ యువత ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సిఎం చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎంఇ పార్క్ల ఆలోచన చేశారని తెలిపారు. కృష్ణాపురం ఎంఎస్ఎంఇ పార్క్లో రూ.100 కోట్ల విలువైన పరిశ్రమలు ఏర్పాటవుతాయని, రూ.12.40 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. మొదటి దశలో 22 ఎకరాల్లో 163 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ పార్క్ల వల్ల ఉత్తరాంధ్రలో ఉపాధి వలసలు తగ్గుతాయన్నారు. భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని, తర్లువాడలో గూగుల్ కంపెనీ కోసం 200 ఎకరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.
కూలిన స్టేజ్
కార్యక్రమం చివర్లో ఎక్కువ మంది ఎక్కడంతో స్టేజ్ కూలిపోయింది. అయితే ముందుగానే అప్రమత్తమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుల వ్యక్తిగత భద్రతా సిబ్బంది వారిని సురక్షితంగా స్టేజ్ నుంచి కిందకు తీసుకువెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.