ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డుల్లో రాష్ట్రంలోని గొల్లపూడి గ్రామ పంచాయతీకి అవార్డు లభించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఆత్మ నిర్భర్ పంచాయతీ కేటగిరిలో ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి గ్రామ పంచాయతీ మూడవ స్థానం సాధించినట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆ శాఖ పేర్కొంది. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకున్న పంచాయతీలకు ఇచ్చే ఈ అవార్డును గొల్లపూడి గ్రామ పంచాయతీ దక్కించుకున్నట్లు చెప్పారు. ఈ నెల 24వ తేదీన పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా బీహార్ రాష్ట్రంలోని మధుబనిలో జరిగే జాతీయ స్థాయి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ అవార్డులు ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు.
