టోల్‌ ఫీజుపై పాత నిబంధనలను ఉపసంహరించుకున్న ఎన్‌హెచ్‌ఏఐ

Aug 27,2024 08:30 #NHAI withdraws, #old rules, #toll fees

హైదరాబాద్‌: టోల్‌ ఫీజు మినహాయింపునకు సంబంధించిన మూడేళ్ల నాటి పాత నిబంధనలను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉపసంహరించుకుంది. టోల్‌ బూత్‌ల వద్ద ఫీజు వసూలు ఎక్కువ సమయం పట్టి వాహనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటే వాటిని టోల్‌ ట్యాక్స్‌ లేకుండానే అనుమతించాలని నిబంధన ఉండేది. దాన్ని ఎన్‌హెచ్‌ఏఐ తాజాగా తొలగించింది. ఎన్‌హెచ్‌ఏఐ 2021 మేలో జారీ చేసిన నిబంధన ప్రకారం ప్రతి టోల్‌ బూత్‌ వద్ద ఒక్కో వాహనం ముందుకు కదిలే సమయం 10 సెకన్ల కంటే తక్కువగా ఉండాలి. ఏ లేన్‌లోనైనా వాహనాల వరుస టోల్‌ బూత్‌ నుండి 100 మీటర్లకు మించకూడదు. టోల్‌ బూత్‌ నుండి 100 మీటర్ల దూరం దాటి వాహనాలు క్యూ పెరిగితే టోల్‌ వసూలు చేయకుండా వాటిని అనుమతించాలి.
ప్రాజెక్ట్‌ పనులు జరుగుతున్న టోల్‌ బూత్‌లు, భూసేకరణ పూర్తికాని టోల్‌ ప్లాజాల కోసం ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిబంధనను రూపొందించింది. అయితే, ఇప్పుడు మూడేళ్ల తర్వాత, ఎన్‌హెచ్‌ఏఐ 2021 నాటి ఆ విధానాన్ని ఉపసంహరించుకుంది. ఈ నియమాన్ని అమలు చేయడంలో ఇబ్బందులు, ప్రజల నుండి వచ్చిన విమర్శల తర్వాత ఈ నిబంధనను తొలగించినట్లు నివేదిక పేర్కొంది. ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పుడు లాంగ్‌ లైన్‌లను నిర్వహించడానికి లైవ్‌ ఫీడ్‌ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. టోల్‌ ప్లాజాల నిర్వహణకు సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టోల్‌ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయానికి వర్తించే నిబంధనలు తక్షణమే రద్దవుతాయి. ఎందుకంటే ఎన్‌హెచ్‌ ఫీజు రూల్స్‌ 2008లో అటువంటి మినహాయింపు ప్రస్తావన లేదు.

➡️