ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : నేవీ అధికారుల హనీ ట్రాప్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) స్పీడు పెంచింది. గురువారం విశాఖలో పలుచోట్ల ఎన్ఐఎ అధికారులు తనిఖీలు చేశారు. 2021లో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నమోదు చేసిన కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా తాజాగా ఏడు రాష్ట్రాల్లో 16 ప్రాంతాల్లో విస్తృత తనిఖీల్లో భాగంగా విశాఖలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా తనిఖీలు నిర్వహించారు. భారత రక్షణ శాఖ సమాచారాన్ని పాకిస్తానీ ఐఎస్ఐకి చెందిన అనుమానితుల లక్ష్యంగా తనిఖీలు జరిపారు. ఐఎస్ఐ నుంచి డబ్బులు అందుకున్న వారిపై కూడా ఎన్ఐఎ నిఘా పెట్టింది. రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంతో పాటు గుజరాత్, కర్ణాటక, కేరళ, తెలంగాణ. ఉత్తరాదికి చెందిన 16 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. 22 సెల్ ఫోన్లు, కీలక పత్రాలు లభించాయని సమాచారం. ఎన్ఐఎ త్వరలో పూర్తి స్థాయి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
