జగన్‌ జడ్‌ ప్లస్‌ భద్రత కేసులో కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు

  • కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
  • వేసవి సెలవుల తర్వాత విచారణ

ప్రజాశక్తి-అమరావతి : సిఆర్‌పిఎఫ్‌ లేదా ఎన్‌ఎస్‌జితో కూడిన జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులివ్వాలంటూ మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రతివాదులైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబి) డైరెక్టర్‌, సిఆర్‌పిఎఫ్‌ డిజి, నేషనల్‌ సెక్యూర్టీ గార్డ్‌ (ఎన్‌ఎసి) డిజి, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులిచ్చింది. తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత జరుపుతామని జస్టిస్‌ ఎస్‌ సుబ్బారెడ్డి ప్రకటించారు. జగన తరపున న్యాయవాది వై నాగిరెడ్డి వాదిస్తూ, పిటిషనర్‌కు భద్రత కల్పన విషయంలో రాష్ట్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేనందున సిఆర్‌పిఎఫ్‌ లేదా ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు గతంలోనే పిటిషనర్‌ కేంద్ర హోంశాఖకు వినతిపత్రం ఇచ్చారని చెప్పారు. జగన్‌కు ప్రాణహాని ఉందని, రాష్ట్రంలో ఇటీవల జగన్‌ చేసిన పర్యటనల సమయంలో జరిగిన ఘటనల ను పరిశీలిస్తే ప్రమాదం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ పి పొన్నారావు ప్రతివాదన చేస్తూ, కౌంటర్‌ వేసేందుకు గడువు కావాలని కోరారు. రాష్ట్రం తరపున ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ, జగన్‌ ఇదే తరహా వ్యాజ్యాన్ని గతంలోనే దాఖలు చేశారని గుర్తు చేశారు. వాదనల తర్వాత హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులిచ్చి విచారణను వాయిదా వేసింది.

➡️