హైదరాబాద్ : ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు ఎన్టీఆర్ అని నారా భువనేశ్వరి అన్నారు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా … ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఆమె నివాళి అర్పించి అనంతరం మాట్లాడారు. రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు. ఆయన సేవలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. దీని ద్వారా పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ”ఎన్టీఆర్ సిద్ధాంతాలను ట్రస్టు పాటిస్తోంది. ఆయన వర్ధంతికి ఏటా లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు.. మరొకరి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది. నాటి నుంచి నేటి వరకు ట్రస్టుకు 8.70 లక్షల మంది రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు రక్తాన్ని అందించాం. చర్లపల్లి ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్లో ఉచిత విద్య, వసతి, భోజనం కల్పిస్తున్నాం. మెరిట్ స్టూడెంట్లకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ట్రస్టు ద్వారా ప్రజాసేవకు అందరికంటే ముందుంటాం. తుపాన్లు, కోవిడ్ సమయాల్లో అనేక సేవలు అందించాం” అని నారా భువనేశ్వరి ట్రస్టు గురించి వివరించారు.
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు ఎన్టీఆర్ : నారా భువనేశ్వరి
