శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై గవర్నర్కు ఫిర్యాదు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోందని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైసిపి బృందం తరుపున గవర్నర్కు అబ్దుల్ నజీర్కు గురువారం ఆయన వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాజ్భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సిఎం సమాజంలో వివక్షను పెంచేవిగా ఉన్నాయని, వాటిపై గరవ్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించామని ఆయన తెలిపారు. సిఎం వ్యాఖ్యలపై తక్షణం జోక్యం చేసుకోవాలనీ విజ్జప్తి చేసినట్లు తెలిపారు. ఇటీవల గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పనులూ తెలుగుదేశం వారికే చేయాలని, వైసిపి వారికి ఏ పనీ ఏయకూడదని అలా చేస్తే పాముకు పాలుపోసినట్లేఅని చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయం లో అందరికీ న్యాయం చేస్తానని చెబుతారని, దానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరామని బొత్స వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకునే లబ్దిదారులకు పార్టీలు ఉండవని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాటిని అందించాలని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాజకీయ నాయకుడూ చంద్రబాబులా మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు చేయాలన ేదే ప్రతి రాజకీయ పార్టీ సిద్ద్ధాంతంగా ఉండాలని అన్నారు. సామాన్యుల అవసరాలకు రాజకీయ రంగు పులమడం మంచిది కాదని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరుపున పోరాడుతామని తెలిపారు. రాష్ట్రంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులపైనా తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించారు. ఈ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గవర్నర్ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, విడదల రజనీ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడు ఉన్నారు.