- పహల్గాం ఘటనపై మాజీ మంత్రి వడ్డే
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భద్రతా వైఫల్యం వల్లే పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందని, ముందస్తు సమాచారం ఉన్నా భద్రతా దళాలు తగు బందోబస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఉగ్రవాదులు కాల్పులు జరిపారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం వద్ద పెద్ద సంఖ్యలో మిలటరీ హెలికాఫ్టర్లు ఉన్నాయని వాటిల్లో సైనికులను పంపాలని అప్పటి జమ్ముకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పినా కేంద్రం పెడచెవిన పెట్టిందని గుర్తు చేశారు. ఫలితంగా పుల్వామా వద్ద దాడి జరగడం అనంతరం జరిగిన ఎన్నికల్లో బిజెపి గెలవడం వెంట వెంటనే జరిగాయని పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన సిఎఎ, ఎన్ఆర్సి, వక్ఫ్ ఎమెండ్మెంట్ చట్టం, బుల్డోజర్ల విన్యాసాలు పరిస్థితులను సహజంగా పాకిస్థాన్ ఉపయోగించుకుని భారత్లో అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అడవులను అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఆదివాసీలను, షెడ్యూలు తెగల ప్రజలను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. వారికి మావోయిస్టులని ముద్రవేసి ఆపరేషన్ ఖగార్ పేరుతో వందలమందిని కాల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లోలిత కాశ్మీర్లో యాత్రికులకు రక్షణగా సైన్యాన్ని తోడు పంపించకపోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇకనుండైనా జమ్ము, వైష్టోదేవి, కాశ్మీర్ ఛార్దామ్, మానస సరోవరం, ఇతర పుణ్యక్షేత్రాల సందర్శకులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు.
మానవత్వానికి మచ్చ : లక్ష్మణరెడ్డి
కాశ్మీర్లో ఉగ్రదాడి మానవత్వానికి మాయని మచ్చని జన చైతన్యవేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఇలాంటి దాడుల వల్ల కాశ్మీర్కు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రపంచదేశాలు భారత్కు మద్దతు పలకడం అభినందనీయమని అన్నారు.