యాత్రికులు ఘాట్‌ రోడ్‌ చెత్తను విసరడం మానుకోవాలి

Apr 19,2025 12:56 #Swachh Andhra, #Tirumala, #ttd
  • టీటీడీ అదనపు సి.హెచ్‌.వెంకయ్య చౌదరి
  • తిరుమల స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛకార్యక్రమం

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో యాత్రికులు ఘాట్‌ రోడ్‌లపై చెత్తను విసరడం మానుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం తిరుమలలోని మొదటి ఘాట్‌ రోడ్‌లో కుంకాల పాయింట్‌ (ఆఖరి మెట్టు) వద్ద ఆయన సిబ్బందితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో ప్లాస్టిక్‌ నిషేధం అమలులో ఉన్నప్పటికీ యాత్రికులు ప్లాస్టిక్‌ కవర్లు, తిను బండారాలు, వాటర్‌ బాటిళ్లను తీసుకొచ్చి రోడ్ల పక్కన విసిరి వేస్తున్నారని చెప్పారు. దీంతో కొంతకాలంగా పెద్ద ఎత్తున చెత్త పోగయ్యిందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమలలో భాగంగా మొదటి ఘాట్‌ రోడ్డులో ఈ చెత్తను తొలగించాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 400 మంది టీటీడీ సిబ్బందితో పాటు పోలీసులు, తిరుమల స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో భాగమయ్యారని చెప్పారు. చెత్తను శుభ్రం చేయడంతో పాటు భవిష్యత్తులో రోడ్డుపై చెత్త విసరకుండా డస్ట్‌ బిన్‌ లు ఏర్పాటు చేశామని తెలిపారు. యాత్రికులందరూ ఆ డస్ట్‌ బిన్‌లలో చెత్త వేయాలి తప్పా వాహనంలో ప్రయాణిస్తూ రోడ్డుపై చెత్త విసరడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో రాజేంద్ర, గార్డెన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు, హెల్త్‌ ఆఫీసర్‌ మధుసూదన్‌, వీజీవోలు సురేంద్ర, సదాలక్ష్మీ, ఇతర పోలీసు అధికారులు, పలు శ్రీవారి సేవకులు, విద్యార్థులు స్వచ్చందంగా పాల్గొన్నారు.

➡️