ప్రజాశక్తి-అమరావతి : టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడి కేసు నిందితుడైన వైసిపికి చెందిన మాజీ ఎంపి నందిగం సురేష్కు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు శుక్రవారం హైకోర్టులో వాదించారు. బెయిల్ ఇవ్వాలంటూ నందిగం వేసిన పిటిషన్లో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దాడి ఘటనా స్థలంలో నందిగం ఉన్నారని, పలువురు సాక్ష్యాలే కాకుండా ఇతర నిందితులు కూడా ఆ మేరకు చెప్పారని తెలిపారు. ఈ మేరకు గూగుల్ టైమ్ను కూడా సేకరించామన్నారు. ఐఫోన్లు పోయాయని చెబుతున్న నందిగం ఆ మేరకు ఫిర్యాదు చేయలేదన్నారు. అనారోగ్య కారణాలతో బెయిల్ కోరుతున్నారని, బెయిల్ ఇవ్వదగ్గ అనారోగ్యం నందిగాం సురేష్కు లేదని అన్నారు. దాడి వెనుక కుట్ర కోణం కూడా ఉందన్నారు. సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని కోరారు. దీనిపై అక్టోబరు ఒకటిన హైకోర్టు విచారణ చేయనుంది.
