పర్యావరణాన్ని కాపాడాలి
40 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న దళితుల భూమిని కూడా వదలని కబ్జాదారులు
ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : కర్నూలు సమీపంలోని గార్గేయపురం, బి తాండ్రపాడు చెరువులను, కబ్జాల నుండి రక్షించి పంట పొలాలను మత్స్యకారులను,పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ వివిధ ప్రజా సంఘాలు కలిసి నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మత్యకారుల సంఘం నగర అధ్యక్షులు బి శ్రీనివాసులు మాట్లాడుతూ చెరువుల కబ్జాల వల్ల మత్స్యకారుల వృత్తి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష వ్యతిరేక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ జి కృష్ణ మాట్లాడుతూ 40 ఏళ్లుగా దళితుల అనుభవంలో కొద్దిపాటి భూమిని బిల్డర్లు ఆక్రమించుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి,ఎం నాగరాజు, వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు డి శ్రీనివాసరెడ్డి, బి వన్నూరు సాహెబ్ మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నాటి చెరువులను వాగులను, నదులను బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ప్లాట్ వేసి వ్యాపారం చేస్తుంటే పాలకులు,ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బోరింగ్ లకు, తాగునీటికి, పంట పొలాలకు నీరు అందించే చెరువులను కాపాడాలని కోరారు. చెరువులు వాగుల వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయోగ ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కబ్జాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు కర్నూలు చుట్టూ జరుగుతున్న భూ కబ్జాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బట్టలు ఉతికేందుకు రజకులకు నీళ్లు కూడా కరువయ్యే పరిస్థితులు రాబోతున్నాయన్నారు. గార్గేయపురం చెరువు సమీపంలో ఇరిగేషన్ అధికారులు వేసిన సిమెంట్ రోడ్డు కూడా కబ్జాకు గురైందని తెలిపారు. చెరువులను వాగులను వంకలను కబ్జాల నుండి కాపాడాలని నీటిపారుదల శాఖ డివిజనల్ ఇంజనీరు సుష్మ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ ధర్నాలో బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం యాకోబు,బి నాగేంద్ర, ఏ గురు స్వామి, ఎండి యూనుస్, ఎన్ పీటర్, ఏ వెంకటేశ్వర్లు, కే మధు, ఎస్ అన్వర్, సివి వర్మ, ఎస్ ఆర్ గౌడు, రహిమాన్, రుస్తుం తదితరులు పాల్గొన్నారు.