ముండ్లమూరు (ప్రకాశం) : అమెరికాలో ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు … ప్రకాశం జిల్లా ముండ్లమూరుకు చెందిన దొద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మలకు కుమారుడు బుచ్చిబాబు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరినీ చదివించారు. కుమారుడు దొద్దాల బుచ్చిబాబు (40) ఎనిమిదేళ్లు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. కంపెనీ ఆదేశానుసారం 18 నెలల కిందట భార్య కిరణ్మయితో కలిసి కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడే నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ సెలవులు కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులతో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లారు. అక్కడ ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విని తల్లి కోటేశ్వరమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. బుచ్చిబాబు మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి చేర్చడానికి ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు.