ప్రజాశక్తి – యడ్లపాడు (పల్నాడు జిల్లా) : ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందులో యువకుడు మృతి చెందగా.. యువతికి గాయాలయ్యాయి. ఈ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం చౌడవరంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు రూరల్ చౌడవరానికి చెందిన కొర్నెపాటి తేజ్ స్థానిక ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. యడ్లపాడు సమీపంలోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే కీర్తనతో పరిచయం ఏర్పడి వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సోమవారం రాత్రి తండ్రితో కలిసి భోజనం చేసిన తేజ్ మరో ఇద్దరి స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో తేజ్, కీర్తన కలిసి వెంకటేశ్వర బాలకుటీర్ వెనుక ఉన్న క్వారీ కొండ ఎక్కారు. ఇద్దరూ కలిసి 50 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై నుండి కింద ఉన్న క్వారీ గుంతలో దూకారు. కొద్దిసేపటికి కీర్తన బయటకు రాగా.. తేజ్ మాత్రం కనిపించలేదు. యువతి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో తేజ్ మృతదేహాన్ని బయటకు తీశారు. దీనిపై యువతి మాట్లాడుతూ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య పాల్పడినట్లు తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
